1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (12:45 IST)

ఉక్రెయిన్ చమురు నిల్వ కేంద్రాలపై రష్యా దాడి.. విషపూరితంగా మారనున్న గాలి

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి. నలువైపుల నుంచి ఈ దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనిక బలగాలు కూడా ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ చమురు నిల్వలపై రష్యా బలగాలు దాడులు చేసి పేల్చాయి. వాసిల్కివ్‌లోని ఓ చమురు డిపోపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఆ చమురు డిపో పేలిపోయింది. దీనివల్ల ఆ ప్రాంతంలో గాలి విషపూరితంగా మారే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. 
 
ఇంకోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నారు. క్షిపణులతోనూ దాడులు చేస్తున్నాయి. కీవ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద కూడా బాంబులతో రష్యా దాడులు చేసింది. దీంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కీవ్ నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే రష్యా లక్ష్యం పూర్తయినట్టుగా భావించవచ్చు. 
 
రష్యా రాకెట్ దాడి...  
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భీకరంగా మారే ప్రమాదం పొంచివుంది. రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అదేసమయంలో ఉక్రెయిన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేస్తుంది. ఫలితంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‍పై పట్టుసాధించాలని తహతహలాడుతున్న రష్యా బలగాల వ్యూహం ఫలించలేదు. దీంతో రష్యా రాకెట్ దాడులకు దిగింది. కీవ్‌లోని అణుధార్మిక వ్యర్థాలను నిల్వచేసిన ప్లాంట్‌ రేడాన్ వ్యవస్థపై రష్యా రాకెట్ దాడి జరిగింది. ఈ దాడితో రేడియేషన్‌ను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ ధ్వంసమైంది. ఈ దాడి ఘటనను రేడాన్ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం చేరవేశారు. 
 
ప్రస్తుతం ఈ ప్రతినిధులంతా షెల్టర్లలో దాగివున్నారు. అలాగే రాకెట్ దాడి జరిగిన ప్రాంతమంతా కాల్పులు, ప్రతిదాడులతో దద్ధరిల్లిపోతోంది. దీంతో అక్కడ నష్టమెంత అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు ఈ దాడితో అణుధార్మికతను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ పని చేయకుండా ఆగిపోయింది. రష్యా ప్రయోగించిన మిస్సైల్.. ఈ రేడాన్ కేంద్రంపై పడుతున్న దృశ్యాన్ని అక్కడ అమర్చిన సీసీ టీవీ కెమెరాలు బంధిచాయి.