బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (21:14 IST)

పెళ్లికి ప్యాంటు, సూటు వేసుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Sanjana Rishi
ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త అయిన సంజన సంప్రదాయ దుస్తులను వదిలిపెట్టి మొదలుపెట్టిన కొత్త పంథా మొదలెట్టారు. భారతదేశంలో పెళ్లి అనగానే పట్టు చీరలు కానీ, పట్టు పావడాలు ధరించిన వధువు రూపం ఊహల్లో మెదులుతుంది. కానీ, సంప్రదాయానికి భిన్నంగా.. సంజన రిషి తన వివాహంలో ప్యాంటు, సూటు ధరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. కొత్త పంథాను మరింత మంది అనుసరిస్తారా? అనే సందేహం చాలా మందికి కలిగింది.
 
పశ్చిమ దేశాలలో గత కొన్ని సంవత్సరాలలో బ్రైడల్ ప్యాంట్ సూట్లు ఫ్యాషన్‌లోకి వచ్చాయి. డిజైనర్లు కూడా పెళ్లి కోసం ప్రత్యేక ట్రౌజర్ల వస్త్రధారణను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీటికి కొంత మంది సెలబ్రిటీలు మద్దతు కూడా పలికారు. గత సంవత్సరం గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్ ఆమె వివాహానికి తెలుపు రంగు ప్యాంటు ధరించారు. ఆమె సంగీతకారుడు జో జెనాస్‌ని లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్నారు.
 
కానీ సంజన రిషి ధరించిన దుస్తులు మాత్రం భారతదేశంలో సాధారణం కాదు. ఇక్కడ సాధారణంగా వివాహానికి వధువు పట్టు చీరలు కానీ, పొడవాటి లెహంగాలను కానీ ధరిస్తారు. వాటిలో మళ్ళీ బంగారపు జరీతో కానీ, సిల్కుతో కానీ ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రాముఖ్యతనిస్తారు.
 
సంజన రిషి వయసు 29 సంవత్సరాలు. ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆమె. దిల్లీ వ్యాపార వేత్త, 33 సంవత్సరాల ధృవ్ మహాజన్‌ని సెప్టెంబరు 20న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఢిల్లీలో జరిగింది. అంతకుముందు అమెరికాలో వారి బంధువులు ఎక్కువగా వుండటంతో వారి వివాహం జరిగిపోయింది.
Sanjana Rishi


ఆగస్టు చివరలో, ఒక రోజు పొద్దున లేవగానే, 'మనం పెళ్లి చేసుకుందాం' అని నా భాగస్వామితో చెప్పాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకోగానే, నేను నా వివాహానికి ఏం ధరించాలని అనుకుంటున్నానో కూడా నేను నిర్ణయించేసుకున్నాను. నేను ఏ ప్యాంటు సూటు ధరించాలని అనుకుంటున్నానో ఆ క్షణమే నాకు తెలుసు" అని రిషి చెప్పారు.
 
"ప్యాంటు సూటు ధరించిన మహిళలో ఏదో శక్తి ఉంటుందని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. నాకవి ధరించడం ఇష్టం. నేనెప్పుడూ అవే ధరిస్తాను. ఈ వివాహం కేవలం 11 మంది సమక్షంలో చిన్న స్థాయిలో జరగడం వలన నాకు ఈ దుస్తులు ధరించడం అర్ధవంతంగానే అనిపించింది" అని చెప్పారు.
 
''వివాహంలో కేవలం మా అమ్మ నాన్నలు, తాత మామ్మలు ఉన్నారు. ఈ వివాహం కూడా ధృవ్ వాళ్ళ ఇంటి పెరట్లో జరిగింది. అందరూ చాలా సాధారణమైన దుస్తులు ధరించారు. అలాంటి సమయంలో నేను భారీ వస్త్రధారణ చేసుకుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండి ఉండేది. చాలా అతిగా అనిపించి ఉండేది" అని రిషి అన్నారు. రిషి వివాహ దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంత మంది ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఆమె ఎన్నుకున్న దుస్తులకు ఆమోదం తెలిపారు.