శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (15:37 IST)

ఢిల్లీ క్యాపిటల్ బౌలర్ ఎన్రిచ్ నోర్జ్ సరికొత్త రికార్డు .. ఏంటది?

యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయభేరీ మోగించింది. ఇందులో ఢిల్లీ జట్టు బౌలర్ ఎన్రిస్ నోర్జె సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలరుగా తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఎన్రిచ్ నోర్జె గంటకు 156.22 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు ఏ ఒక్క ఐపీఎల్ బౌలర్ ఇంత వేగంతో బంతిని విసిరిన దాఖలాలు లేవు. అయితే, 26 యేళ్ళ నోర్జె విసిరిన బంతిని రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్‌మెన్ మన్‌జోస్ బట్లర్ అంతే వేగంతో బౌడరికీ తరలించాడు. ఆ తర్వాత బంతిని నోర్జె గంటకు 155.21 కిలోమీటర్ల వేగంతో సంధించగా, ఈసారి జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 
 
మొత్తమ్మీద రెండు వరుస బంతులను 150 కిమీ పైచిలుకు వేగంతో విసరడం ద్వారా ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఫాస్టెస్ బాల్ వేసిన రికార్డు దక్షిణాఫ్రికాకే చెందిన డేల్ స్టెయిన్ పేరిట ఉంది. 2012 సీజన్‌లో స్టెయిన్ వేసిన ఓ బంతి గంటకు 154.40 కిమీ వేగంతో దూసుకెళ్లింది. 
 
ఇక, బుధవారం నాటి మ్యాచ్‌లో తాను అత్యంత వేగవంతమైన బంతి విసిరిన సంగతి నోర్జెకు మ్యాచ్ అయిపోయే వరకు తెలియదట. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన ఈ సఫారీ స్పీడ్‌స్టర్ ఇప్పటివరకు 6 టెస్టులాడి 19 వికెట్లు సాధించాడు. 7 వన్డేల్లో 14 వికెట్లు, 3 టీ20 అంతర్జాతీయ పోటీల్లో 2 వికెట్లు పడగొట్టాడు. 
 
కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 148కే చతికిలపడి ఓటమి పాలైంది.
 
నిజానికి తొలుత లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పారేసుకోవడంతో ఓటమిని కొనితెచ్చుకుంది. మరోవైపు, ఢిల్లీ బౌలర్లు తుషార్ దేశ్‌పాండే, అన్రిక్‌, రవిచంద్రన్ అశ్విన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.