1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (14:14 IST)

గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో పంజాబ్ ఖేల్‌ఖతం...

ఐపీఎల్ టోర్నీ సాగే కొద్దీ మ్యాచ్‌లు సాగుతున్న తీరు తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో సింహం భాగం ఆ విధంగానే సాగాయి. దీనికి కారణం అన్ని జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు చేజేతులా ఓడింది. 
 
కేకేఆర్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్‌ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు రాహుల్‌ (74), అగర్వాల్‌(56) అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు. ప్రసిద్ధ్‌ (3/29), నరైన్‌(2/28) రాణించారు. 
 
తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. కార్తీక్‌ (58), గిల్‌(57) అర్థసెంచరీలతో 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. షమీ, అర్ష్‌దీప్‌సింగ్‌, బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. అర్థసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించిన కార్తీక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. 
 
అంతకుముందు... లక్ష్యఛేదనలో పంజాబ్‌కు శుభారంభం దక్కింది. రాహుల్‌, మయాంక్‌ మరోమారు బ్యాట్లు ఝులిపించారు. అయితే ప్రసిద్ధ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రస్సెల్‌ విడిచిపెట్టాడు. ఈ కన్నడ ద్వయం చూడచక్కని షాట్లతో అలరించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి 47/0 స్కోరు చేసింది. 
 
సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో మయాంక్‌ను ఔట్‌ చేసిన ప్రసిద్ధ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పూరన్‌(16) మూడు ఓవర్ల తేడాతో నిష్క్రమించాడు. దీంతో గెలుపు సమీకరణం కాస్తా 12 బంతుల్లో 20 పరుగులుగా మారింది. కానీ ఇక్కడే కోల్‌కతా కమాల్‌ చేసింది. 19 ఓవర్లో ప్రసిద్ధ్‌ మూడు బంతుల తేడాతో ప్రభ్‌సిమ్రన్‌(4), రాహుల్‌ను పెవిలియన్‌ పంపాడు. 
 
ఆఖరి ఓవర్లో పంజాబ్‌ విజయానికి 14 పరుగులు కావాలి. క్రీజులో మ్యాక్స్‌వెల్‌, మన్‌దీప్‌సింగ్‌ ఉన్నారు. నరైన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో మన్‌దీప్‌ను బోల్తా కొట్టించాడు. ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమైన దశలో మ్యాక్స్‌వెల్‌ తన బలాన్నంతా కూడదీసుకుని కొట్టినా...ఇంచు తేడాతో బౌండరీ ముందు పడటంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. 
 
కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 63 పరుగులకే మూడు కీలక వికెట్లు త్రిపాఠి(4), రానా(2), మోర్గాన్‌(24) వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న కోల్‌కతా.. గిల్‌, కార్తీక్‌ ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోరు అందుకుని, చివరకు గెలుపును సొంతం చేసుకుంది.