శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (12:57 IST)

ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వరా? ఆపిల్ సంస్థకు షాక్.. రూ.15కోట్లు ఫైన్

స్మార్ట్ ఫోన్ కొంటే తప్పకుండా ఛార్జర్, హెడ్ సెట్స్ కూడా పొందే అవకాశం వుండేది. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఇప్పుడు చాలా కంపెనీలు హెడ్‌సెట్స్ ఇవ్వడం ఆపేశాయి. ఇక ఈ-వేస్ట్ సమస్యను అరికట్టడంతో పాటు పర్యావరణ హితం పేరుతో ఆపిల్ సంస్థ అయితే.. ఐఫోన్-12కు ఛార్జర్స్, ఇయర్ బడ్స్‌ను ఇవ్వడం ఆపేసింది.

ఈ విషయంపైన బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి ఆపిల్ సంస్థపై కేసు వేశాడు. ఆ కేసును విచారించిన అక్కడి వినియోగదారుల ఫారం(ప్రొకాన్-ఎస్పీ) ఆపిల్ కంపెనీకి అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఫోన్‌తో పాటు ఛార్జర్ ఇవ్వనందుకు ఏకంగా 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 15 కోట్లు) ఫైన్ విధించింది.
 
గత ఏడాది అక్టోబర్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్ 12ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు ఛార్జర్, ఇయర్ బడ్స్ రావని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్‌తో కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తోంది. ఈ చర్య వల్ల ఈ-వేస్ట్ సమస్యను అరికట్టడమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం పరిష్కరిచవచ్చునని ఆపిల్ సంస్థ తెలిపింది. ఇక ఇదే కోవలో శాంసంగ్, ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు సైతం ఫోన్లతో ఛార్జర్ ఇవ్వడం ఆపేశాయి.
 
ఇదిలా ఉంటే ఆపిల్ ఐఫోన్-12ను యూఎస్‌లో 729 డాలర్లకు అమ్ముతున్నారు. ఇక బ్రెజిల్‌లో ఈ ఫోన్‌ను ఏకంగా 1200 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఇంత అధిక ధరను వెచ్చించినా మొబైల్ ఫోన్‌తో పాటు ఛార్జర్ ఇవ్వకపోవడంతో బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి ప్రొకాన్ ఎస్పీని ఆశ్రయించాడు.
 
అతడి ఫిర్యాదును విచారించిన వినియోగదారుల ఫారం ఆపిల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జర్ లేకుండా ఫోన్ అమ్మడం కరెక్ట్ కాదని.. ఛార్జర్ ఇవ్వనప్పుడు ధరను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఆపిల్ సంస్థకు 2 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. కాగా, బ్రెజిల్ చట్టాలకు లోబడి కంపెనీలు పనిచేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆపిల్ సంస్థను హెచ్చరించింది.