మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:52 IST)

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ నుంచి గూగుల్, ఆపిల్ డేటాను దొంగలిస్తుందా?

ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజ్ రీసెర్చర్ డగ్లస్ లీత్ చేసిన అధ్యయనంలో కొన్ని సంచలన విషయాలు వెలువడ్డాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ మొబైల్స్ వాడుతున్న యూజర్ల నుంచి గూగుల్‌, ఆపిల్ ఏ డేటాను ఎలా సేకరిస్తున్నాయన్న అంశంపై అధ్యయనం నిర్వహించారు. తాజా అధ్యయనం ప్రకారం ప్రతి 4.5 నిమిషాలకు మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్‌కు చేరుతూనే ఉంటుంది. 
 
ఆండ్రాయిడ్ అయితే గూగుల్‌కు, ఐఓఎస్ అయితే ఆపిల్‌కు మీ మొబైల్‌లోని సమాచారం వెళ్తుంది. అంతేకాదు అసలు మీరు మొబైల్‌ను వాడకపోయినా కూడా అందులోని డేటా మాత్రం వాళ్లకు చేరుతూనే ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. 
 
ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఫోన్ ఐఎంఈఐ, హార్డ్‌వేర్ సీరియస్ నంబర్‌, సిమ్ సీరియల్ నంబర్‌, ఐఎంఎస్ఐ, హ్యాండ్‌సెట్ ఫోన్ నంబర్‌, ఇతర సమాచారాన్ని ఆపిల్‌, గూగుల్‌కు చేరవేస్తాయి. మీరు మొబైల్‌లో సిమ్ వేసిన వెంటనే ఆ సమాచారం కూడా వాటికి తెలిసిపోతుంది.
 
డేటా బదిలీపై ఇప్పటికే యూజర్లకు నియంత్రణ లేదని ఈ అధ్యయనం తేల్చింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ షేర్ అయిన డేటాలో యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రెస్‌, పేమెంట్ కార్డుల వివరాలు కూడా ఉంటున్నాయి. ఇక డివైజ్ ఐపీ అడ్రెస్‌తో యూజర్ లొకేషన్ కూడా ఈ కంపెనీలు తెలుసుకోవచ్చు.
 
ఆపిల్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ 20 రెట్లు ఎక్కువ డేటాను యూజర్ల నుంచి సేకరించి గూగుల్‌కు షేర్ చేస్తున్నట్లు లీత్ చేసిన అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉన్న గూగుల్ పిక్సెల్ 2, ఐఓఎస్ 13.6.1 ఉన్న ఐఫోన్ 8లను లీత్ వాడారు.
 
ఆండ్రాయిడ్ గూగుల్ సెర్చ్ బార్‌, క్రోమ్‌, యూట్యూబ్‌, గూగుల్ డాక్స్‌, సేఫ్టీహబ్‌, గూగుల్ మెసెంజర్‌, డివైజ్ క్లాక్ నుంచి డేటా సేకరిస్తున్నట్లు గుర్తించారు అదే ఐఓఎస్ మాత్రం సిరి, సఫారీ, ఐక్లౌడ్ నుంచి డేటా సేకరిస్తోంది. ఫోన్ అసలు వాడకపోయినా 12 గంటల వ్యవధిలో 1 ఎంబీ డేటాను ఆండ్రాయిడ్ షేర్ చేసిందని కూడా ఈ అధ్యయనం చెప్పింది. అయితే గూగుల్ మాత్రం ఈ అధ్యయనాన్ని ఖండించింది.