1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (18:36 IST)

#ZuckerbergShameOnYou కిసాన్ ఫేస్‌బుక్ పేజీని తొలగిస్తారా?

కిసాన్ ఏక్తా మోర్చా అనే పేరిట ఫేస్ బుక్ పేజీని తొలగించిన కారణంగా ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది. 
 
కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీతో పాటు సరిహద్దుల్లో చలిని సైతం లెక్కచేయకుండా శాంతియుతంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెనక్కి తగ్గకపోవడం తో రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాల్లో సవరణలకు కేంద్రం ఆలోచిస్తాం అని చెప్తున్నప్పటికీ అసలు ఆ చట్టాలని పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందే అప్పటివరకు వెనక్కి తగ్గేదే లేదంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు.
 
ఈ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం రైతులతో చర్చ జరుపుతోంది. ఇదిలా ఉంటే.. రైతులు తమ నిరసనను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు.  రైతు సమస్యలపై ఫేస్ బుక్ లో ఓ పేజీని కిసాన్ సంయుక్త్ మోర్చాకు చెందిన ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ఆ పేజీకి యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 94 లక్షల మందికి రీచ్ కూడా అయ్యింది. 
 
లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా పేజీ కనిపించలేదు. దీంతో సంయుక్త్ కిసాన్ మోర్చా ఆందోళనకు గురయ్యింది. అయితే ఆ తర్వాత కొద్ది సమయంలోనే ఫేస్ బుక్ లో పేజీ కనిపించింది. పేజీ కనిపించడంతో ఊరట కనిపించినా..ఎందుకు తొలగించారని నెటిజన్లు ప్రశ్నించారు. పేజీని కనిపించకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. ఇలా ఫేస్ బుక్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దాదాపు 3గంటలకు తర్వాత కిసాన్ ఏక్తా మోర్చా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలు యాక్టివ్ అయ్యాయి. అయినప్పటికీ #ZuckerbergShameOnYou అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది.