1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (18:33 IST)

యూజర్స్ గోప్యతకే తొలి ప్రాధాన్యం : వాట్సాప్

యూజర్స్ వ్యక్తిగత గోప్యతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెపింది. ఇదే అంశంపై వాట్సాప్ యాజమాన్యానికి కూడా లేఖ రాసింది. 
 
ఈ క్రమంలో వాట్సాప్‌ కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల గోప్యతే మాకు ప్రధానమని హామీ ఇచ్చామని తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, రాబోయే రోజుల్లో వాట్సాప్‌ కార్యాచరణలో ఏ మార్పులుండవని చెప్పింది.
 
అయితే, వినియోగదారులకు ప్రైవసీ పాలసీపై అప్‌డేట్‌ను ఇస్తూనే ఉంటామని తెలిపింది. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు వాట్సాప్‌ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. తాము ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని యూజర్ల అకౌంట్లు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలిపింది. 
 
కాగా, ఇటీవల వాట్సాప్‌ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో మే 15 నుంచి అమలు చేయాలని వాట్సాప్‌ సూచించిన నూతన ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్రం ఈ నెల 18న వాట్సాప్‌ ప్రతినిధులకు లేఖ రాసింది.
 
వారంలోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సమాచార మార్పిడి కోసం చాలా మంది భారతీయులు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని, ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయులపై వాట్సాప్‌ వివక్షతో వ్యవహరిస్తోందని కేంద్రం నోటీసుల్లో ప్రస్తావించింది. కొత్త ప్రైవసీ పాలసీకి మే 15 వరకు గడువు విధించగా.. అనంతరం దాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది.