మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (13:27 IST)

జీ ఎంటర్‌టైన్మెంట్‌పై కన్నేసిన రిలయన్స్ జియో

ఇప్పటివరకు అంతర్జాతీయ సంస్థలతో మాత్రమే జట్టు కడతామని ప్రకటిస్తూ వచ్చిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్‌లు ఇప్పుడు దేశీయ వ్యాపార సంస్థలతో కూడా జట్టు కడతామని ప్రకటించింది. ఆర్థిక ఒడిదిడుకులతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి ప్రకటన చేయడంతో పలు సంస్థలు దీనిపై కన్నేశాయి. 
 
ఇందులో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా మరో కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది. టెలికం రంగంలో ఛాలెంజింగ్‌గా దూసుకెళ్తున్న జియో ఇటీవల మీడియా కంటెంట్ విషయంలో కూడా తనదైనశైలిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
ఇందు కారణంగానే జియో జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని తాజా సమాచారం. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర తన వాటాలను విక్రయించాలని భావిస్తున్నారు. వీటిలో దాదాపు సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ముందుకు వస్తోంది. 
 
ఇదిలావుండగా, ఇప్పటికే జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాలను కొనుగోలు చేసేందుకు అమేజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజాలు పోటీలో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్‌టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్‌ వంటి సంస్థలు కూడా జాబితాలో ఉన్నాయి.