1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (16:59 IST)

హైవేమీద మహీంద్ర ఎస్‌యూవీ ఒక్కటే టైగర్‌ కాదు.. ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ వీడియో ద్వారా పెద్ద చర్చకు తెరలేపారని చెప్పవచ్చు. ఆ వీడియోలో హైవేపై రెండు పులులు దర్జాగా నడిచి పోతున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
ఈ వీడియోతో ఒక ఆసక్తికరమైన శీర్షికను కూడా యాడ్‌ చేశారు. 'హైవేమీద మహీంద్ర ఎస్‌యూవీ ఒక్కటే టైగర్‌ కాదు.. ఇంకా బిగ్‌ కేట్స్‌ ఉన్నాయన్నమాట.. అద్భుతం'' అంటూ కామెంట్‌ చేశారు. ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అంతే​​కాదు ఈ వీడియోపై ఎక్కడ ఎలా తీశారనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆగస్ట్ 19న మహాబలేశ్వర్ సమీపంలోని పంచగని రహదారిపై పులులు కనిపించాయని ఈ వీడియో క్లిప్పింగ్‌లో పేర్కొన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర, చంద్రపూర్‌లోని తడోబాలో చాలాకాలం క్రితం నాటి వీడియో ఇదని వ్యాఖ్యానించారు.
 
అంతేకాదు కొంతమంది ప్రకృతి, పర్యావరణం, అడవుల ధ్వంసం, ఆయా భూభాగాలను ఆక్రమించడం లాంటి అంశాలపై నిరసనగా స్పందించారు. వాటి నివాసాలను మనం ఆక్రమించుకుంటున్నాం... ఎవరైనా మనల్ని అలా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకోండి.. దయచేసి వాటి మానాన వాటిని అలా ఉండనివ్వండి అని కొందరు, పాపం తమ ఇల్లు ఏమైందని ఆశ్చర్యపోతున్నట్టున్నాయంటూ విచారం వ్యక్తం చేయడం విశేషం.