శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (12:23 IST)

వాట్సాప్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్ ఏంటది?

వాట్సాప్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఇకపై ఈ మెసేజింగ్‌ యాప్‌ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్‌ వంటివి చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. కేంద్రం అనుమతులపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ హర్షం వ్యక్తం చేశారు. 
 
యూపీఐతో భారత్ ప్రత్యేకత సాధించిన సంగతి తెలిసిందే. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఇలాంటి ఘనత సాధించిన తొలి దేశం భారతే. ఇందులో మేము కూడా భాగస్వాములు కావడం.. డిజిటల్‌ ఇండియాకు మా వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వాట్పాస్‌ ద్వారా డబ్బు పంపించడం.. సందేశాలు పంపించినంత సులభమని జుకర్‌ అన్నారు.
 
వాట్సాప్‌ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని, 140కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పేమెంట్స్‌ జరుపుకోవచ్చని వెల్లడించారు. చెల్లింపులకు మరింత భద్రత కల్పించేలా త్వరలోనే వాట్సాప్‌ యూపీఐని తీసుకురానున్నట్లు జుకర్‌ చెప్పారు. 
 
పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. భారత్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నప్పటికీ యూజర్లందరికీ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండదు. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని ఎన్‌పీసీఐ వెల్లడించింది.