గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (09:13 IST)

స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోతున్నాడా? ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది...

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి అత్యధిక స్థానాలు దక్కుతాయని వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీకి మరో అవకాశం ఇవ్వాలని భావించిన ఓటర్లు... తిరిగి ఆ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వనున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. 
 
ఇంతవరకుబాగానే ఉన్న, దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే దక్కుతాయని తేలింది. అంటే.. ఈ రాష్ట్రం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీల్లో ఒక్కరు మాత్రమే గెలుపొందుతారనే సంకేతాలను ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది. 
 
ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ మాత్రం అమేథీతో పాటు.. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ కంచుకోట వాయనాడ్‌లో ఆయన గెలుపు నల్లేరుపై నడక అయినప్పటికీ... అమేథీలో మాత్రం బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో హోరాహోరీ తప్పదని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తెలిపింది. 
 
రాహుల్ గత 2004 నుంచి అమేథీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009, 2014లో జరిగిన వరుసగా రాహుల్ గాంధీనే ఎంపీగా గెలుపొందారు. 2014లో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెపై 1,07,903 ఓట్ల ఆధిక్యంతో రాహుల్ విజయం సాధించారు. అయితే.. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం 2014 నాటి పరిస్థితి ఉండకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించిన 'ఇండియా టుడే' అభిప్రాయపడింది. 
 
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్మృతి ఇరానీ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయడం కూడా అమేథీలో నష్టం కలిగించే అంశమని తెలిపింది. అంతేకాదు, అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోతారా? అన్న ప్రశ్నను కూడా ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా 'ఇండియా టుడే' తెరలేపింది.