శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (10:10 IST)

మోడీ చేసే వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు రావు : ఈసీ

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, అధికార బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసీ చర్యలు కూడా విపక్ష నేతల ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. 
 
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హిందువుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం, రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై మోడీ చేసిన వ్యాఖ్యలపై క్లీన్ చిట్ ఇచ్చింది. 
 
ఏప్రిల్ ఒకటో తేదిన మహారాష్ట్రలోని వార్దాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీ వైఖరి, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీకి దిగడంపై ఘాటు విమర్శలు చేశారు. హిందువులను కాంగ్రెస్ అవమానించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని శిక్షించాలని నిర్ణయించుకున్నారని మోడీ అన్నారు. 
 
ఆ కారణంగానే రాహుల్ హిందువులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పోటీకి భయపడుతున్నారని, మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వలసపోతున్నారని మోడీ విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న మోడీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వీటిని పరిశీలించిన ఈసీ క్లీన్‌చిట్ ఇచ్చింది.