గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:32 IST)

మీరట్‌లో విషాదం.. శిథిల భవనం కూలి పది మంది మృత్యువాత

death
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
మీరట్‌లోని స్థానిక జకీర్ కాలనీలో ఉన్న ఈ భవనం 50 ఏళ్ల నాటిది. శిథిల పరిస్థితుల్లో ఉన్న భవనం గత సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద ఓ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఒక కుటుంబం మొత్తం సమాధి అయిపోయింది. కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయి.
 
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక పక్క వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానిక వలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 
 
అర్ధరాత్రి 2 గంటల వరకు శిథిలాలు తొలగించగా, ఈ ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. కూలిన భవనం ఇరుకు ప్రదేశంలో ఉండడంతో బుల్డోజర్లు అక్కడి వెళ్లలేకపోతున్నాయని పోలీసులు తెలిపారు.
 
తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన నఫీసా (63), ఫర్హానా (20), అలీసా (18), సాజిద్ (40), సానియా (15), సాఖిబ్ (11), సిమ్రన్ (15 నెలలు), ఆలియా (6), రిజా (7), రిమ్సా (5 నెలలు) గా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.