1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (09:14 IST)

రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు... ఇద్దరు వ్యక్తుల మృతి

train
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో జరిగింది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పర్సాబాద్ సమీపంలోని పూరి నుంచి ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గుర్తించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. 
 
ఆ సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నది. డ్రైవర్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత రైలు మరో ఇంజిన్ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజిన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు.