1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (18:55 IST)

ఎన్డీయే భేటీకి 38 పార్టీల నేతలు హాజరు : జేపీ నడ్డా

jp naddah
ఈ నెల 18వ తేదీన ఢిల్లీ వేదికగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరుగనుంది. ఇందులో 38 రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఎన్డీయే పరిధి పెరిగిందని, గత తొమ్మిదేళ్ల కాలంలో ప్రశంసలు అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని తెలిపారు. 
 
నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఈచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీయే భాగస్వామి పక్షాలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎన్డీయే కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించిన నడ్డా.. యూపీయేకు నాయకుడే కాదు.. నిర్ణయాలు తీసుకొనే శక్తి కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. వారిది స్వార్థ ప్రయోజనాల ఆధారంగా ఏర్పడిన పొత్తులేనని విమర్శించారు. 
 
గత తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనలో అవినీతిని ఉపేక్షించలేదని.. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని మోడీ ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచారని నడ్డా కొనియాడారు. ఎన్డీయే ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సుపరిపాలన అందించిందని.. అందుకోసం నిరంతరం కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.28 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు వెల్లడించారు. నేడు, రేపు విపక్షాల భేటీ బెంగళూరులో జరుగుతున్న వేళ ఎన్డీయే తన బలాన్ని నిరూపించుకునేలా నిర్వహించే రేపటి ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.