1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

60 రూపాయల కోసం పదేళ్ల న్యాయపోరాటం.. ఎవరు?

court
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కేవలం అరవై రూపాయల కోసం పదేళ్ళ పాటు న్యాయపోరాటం చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించాడు. ఆ వ్యక్తి పేరు కమల్ ఆనంద్. సౌత్ ఢిల్లీ వాసి. గత 2013లో సాకేతి డిస్ట్రిక్ట్ సెంటరులో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాపీ ఔట్‌లెట్‌లో కాఫీ తాగేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. కాఫీ తాగితే పార్కింగ్ ఉచితమని ప్రచారం చేస్తూ ఓ ఉద్యోగి వారికి ఆఫర్ స్లిప్ ఇచ్చారు. 
 
దీంతో వారు కాఫీ కాఫీలు తాగిన తర్వాత కారును పార్కింగ్ నుంచి బయటకు తీసుకెళుతుండగా, మాల్ సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ ఫీజుగా రూ.60 చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. వెంటనే కాఫీ షాపులో తనకు ఇచ్చిన ఫ్రీ పార్కింగ్ ఆఫర్‌ టిక్కెట్‌ను చూపించారు. అయినప్పటికీ రూ.60 పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేదేం లేక పార్కింగ్‌ ఫీజు చెల్లించి కమల్‌ బయటకు వచ్చేశాడు. 
 
ఆ తర్వాత దక్షిణ ఢిల్లీలోని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఇందుకు సంబంధించి కేసు దాఖలు చేశాడు. విచారణ పదేళ్ల పాటు సాగింది. 'కస్టమర్లకు ముందుగా ఆఫర్ల గురించి చెప్పి.. వారికి ఆ సేవలు అందించకుండా తిరస్కరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది' అని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై రూ.61,201 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కమల్‌కు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. సో.. రూ.60 పార్కింగ్ ఫీజు కోసం పదేళ్లపాటు చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించిన కమల్ ఆనంద్‌కు రూ.61,201 డబ్బులు కూడా వచ్చాయి.