శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:45 IST)

లెఫ్ట్ పార్టీలకు జాతీయ హోదా రద్దు

వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలకు జాతీయ హోదా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిపిఐ, సిపిఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు పార్టీ జాతీయ హోదా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. అలాగే కనీసం రెండు అసెంబ్లీ స్థానాలను అయినా కైవసం చేసుకుని ఉండాలి.  
 
అంతేకాదు ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని అయినా గెలవాలి.  
 
అలా కూడా కాని పక్షంలో ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో అయినా విజయం సాధించాలి. లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
 
కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు ప్రభావం చూపని నేపథ్యంలో ఆ పార్టీలకు జాతీయ పార్టీ హోదాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.