1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (08:59 IST)

తాజ్‌మహల్ భూగర్భ గదుల ఫోటోలు విడుదల

Tajmahal
Tajmahal
తాజ్‌మహల్ వాస్తవానికి తేజా మహలయ అనే పేరున్న శివాలయం అని బీజేపీ అయోధ్య విభాగం మీడియా ఇన్ చార్జ్ రజనీష్ సింగ్ లక్నో కోర్టు బెంచ్‌ ముందు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజ్ మహల్ భూగర్భ గదుల గురించి విస్తృత ప్రచారం జరిగింది. తాజ్‌మహల్ కట్టడం నిజ చరిత్రను ప్రచురించడానికి నిజనిర్ధారణ కమిటీని నెలకొల్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు తాజ్‌మహల్ భూగర్భ గదుల గురించి భారత పురావస్తు శాఖ వివరణ ఇచ్చింది. యమునా నది ఒడ్డున ఉన్న తాజ్‌మహల్ భూగర్భ గదుల్లో నిర్వహణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని పురావస్తు శాఖ తెలిపింది. 
 
కరిగిపోయిన పెచ్చులు ఊడుతున్న సున్నపు పూతను తొలగించి, సాంప్రదాయికంగా వాడే సున్నపు పూత ప్రక్రియను మొదలెట్టామని, పాత, కొత్త గదులకు సంబంధించిన ఫొటో గ్రాఫులను పురావస్తు శాఖ న్యూస్ లెటర్‌లో కూడా ప్రచురించామని తెలిపింది. 
 
ప్రతి నెలా తాము తాజ్‌మహల్ భూగర్భ గదుల్లో జరుగుతున్న మెయిన్‌టెనెన్స్ పనుల తీరుకు సంబంధించిన ఫొటోలను తీసి ఢిల్లీలోని పురావస్తు శాఖ కేంద్ర కార్యాలయానికి పంపుతుంటామని వివరించింది.
 
తాజ్‌మహల్ భూగర్భ గదుల్లో విగ్రహాల్లాంటివి ఏమీ లేవని భారత పురావస్తు శాఖ పేర్కొంది. ఆ గదుల్లో ఎలాంటి రహస్యాలూ లేవని, తాజ్‌మహల్ కట్టడంలో అవి ఒక భాగం మాత్రమేనని, వాటికి పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదని తెలిపింది.