1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (15:41 IST)

విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్ - పంజాబ్‌లో విద్యా సంస్థల మూసివేత

దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 35 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇపుడు పంజాబ్ రాష్ట్రం కూడా కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ముఖ్యంగా, రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని ఆదేశించింది. 
 
అలాగే, క్రీడా ప్రాంగణాలు, ఈతకొలనులు, వ్యాయామశాలను పూర్తిగా వేయాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. అయితే, విద్యా సంస్థలు మూసివేసిన దరిమిలా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. 
 
ఇకపోతే, మల్టీప్లెక్స్‌లో, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మద్యంబార్లు, షాపింగ్ మాల్స్, స్పాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియం‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని పంజాబ్ సర్కారు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.