1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (13:59 IST)

కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ రిమాండ్... తీహార్ జైలుకు తరలింపు!!

kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆయన వద్ద విచారణ నిమిత్తం ఈడీకి ఇచ్చిన కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆయనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. మరోవైపు, బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ ఆయనకు ఈడీ ఏకంగా తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఊరట కోసం ఆయన చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. దీంతో మార్చి 22వ తేదీన కేజ్రీవాల్‌ నివాసానికి తనిఖీల పేరుతో వెళ్లిన ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టు అయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు.