శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:55 IST)

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసినట్టు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు సచిన్ పైలట్ సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఐసీసీ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ పేరును గురువారం రాత్రి ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం... రాజస్థాన్ సీఎం విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగించింది. రాజస్థాన్ సీఎం పదవి కోసం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 
 
సీఎం పగ్గాలు తమ నాయకుడికే ఇవ్వాలంటూ వారివారి మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులైతే రెండు బస్సులకు కూడా నిప్పుపెట్టారు. దీంతో తమ మద్దతుదారులు సంయమనం పాటించాలని వారు కోరారు.
 
ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం ఎంపికపై పలువురు పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... సీఎంగా అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. అశోక్ గెహ్లాట్‌కున్న సుదీర్ఘ అనుభవం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది.