1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (08:48 IST)

పరీక్షా కేంద్రానికి పొట్టిబట్టలు వేసుకొచ్చిందనీ.... కాళ్ళకు కర్టెన్ చుట్టేశారు...

సాధారణంగా పరీక్ష హాలుకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించరు. ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తుంటాం. కానీ, ఇక్కడో విచిత్ర సంఘటన జరిగింది. ఓ యువతి పొట్టిబట్టలు వేసుకొచ్చిందనీ ఆమె కాళ్లకు కర్టెన్ చుట్టి పరీక్ష రాయించారు. ఈ సంఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుధవారం జూబ్లీ (19) అనే విద్యార్థిని  అస్సాంలోని గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (జీపిఐస్‌) భవనంలో అస్సాం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (ఏఏయూ) రాసేందుకు వచ్చింది. 
 
తన స్వగ్రామం బిశ్వనాథ్ చారియాలి నుంచి తేజ్‌పుర్‌కు 70కి.మీ తన తండ్రితో పాటు ప్రయాణించి చేరుకుంది. అయితే పరీక్షా హాలుకు చేరుకున్న తర్వాత ఆమెకు ఎదురైన అనుభవంతో ఒక్కసారి అవాక్కయింది. 
 
'సెంటర్‌ లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డ్స్‌ అనుమతించారు. అయితే ఎగ్జామ్‌ హాల్‌ లోపలికి వెళ్తుంటే షార్ట్స్‌ ధరించానని చెప్పి ఇన్విజిలేటర్ నన్ను పరీక్ష రాయనివ్వకుండా ఆపేశారు. దీంతో ఏడ్చుకుంటూ బయట ఉన్న మానాన్నతో జరిగిన విషయమంతా చెప్పా. పరీక్ష రాసేలా చూడమని ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌ని అడిగితే.. పాంట్స్‌ వేసుకొస్తే తప్ప లోపలికి రానివ్వమని కరాకండీగా చెప్పేశారు.
 
దీంతో మా నాన్న 8 కి.మీ ప్రయాణంచి మార్కెట్‌లోకి వెళ్లి ట్రౌజర్‌ తీసుకొచ్చారు. ఈలోపే నాకు కర్టెన్‌తో కాళ్లు కప్పి పరీక్ష రాయించారు. నా జీవితంలో అత్యంత అవమానకరమైన సంఘటన' ఇది అంటూ బోరున పిలవిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
నిజానికి కొన్నిరోజుల క్రితం నీట్‌పరీక్ష రాసేందుకు ఇదే డ్రెస్‌లో వెళ్లా. అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఏఏయూ వాళ్లు సైతం డ్రెస్‌కోడ్‌ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. మరి నేను ఎలా తెలుసుకోగలను? అంటూ మీడియా ముందు ఆమె ప్రశ్నలేవనెత్తింది. డ్రెస్‌పై చూసిన శ్రద్ధ కొవిడ్‌ నిబంధనలపై లేదని ఆమె ఆరోపించారు. మాస్కు ధరించడం, టెంపరేచర్‌ చెక్‌ చేయడం పక్కన పెట్టేశారని తెలిపారు.