గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:34 IST)

బెంగుళూరు సెంట్రల్ డీసీపీ వినూత్నశైలి... జాతీయ గీతం ఆలాపనతో...

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక రాష్ట్రంలో కూడా చెలరేగాయి. ముఖ్యంగా, సెంట్రల్ బెంగుళూరులో ఈ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
అదేసమయంలో నిరసనకారులను శాంతింపజేసేందుకు బెంగళూరు (సెంట్రల్) డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ వినూత్న శైలిలో వ్యవహరించారు. బెంగళూరు టౌన్ హాల్‌ వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడంతో డీసీపీ వారిని శాంతిపజేసి వెనక్కిపంపే ప్రయత్నం చేశారు. అయితే తాము వెనక్కి వెళ్లేది లేదని నిరసనకారులు భీష్మించుకుకూర్చున్నారు. 
 
తనను నమ్మండని, ఆందోళన వద్దని, తనను విశ్వసించినట్లయితే తనతో కలిసి జాతీయ గీతం పాడమని వారిని డీసీపీ చేతన్ కోరారు. అనంతరం, ఆయన జాతీయ గీతాలాపన చేశారు. నిరసనకారులు కూడా ఆయనతో గొంతు కలిపారు. జాతీయగీతం పాడటం పూర్తికాగానే నిరసనకారులు శాంతించి అక్కడి నుంచి తమంత తాముగా వెనుదిరిగారు.
 
కాగా, గురువారం మంగళూరులో జరిగిన ప్రదర్శన హింసకు దారితీయడంతో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా పలువురిని బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళూరు సిటీ, దక్షిణ కన్నడ జిల్లాలో 48 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.