గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (12:00 IST)

బీహార్ రిజల్ట్స్ : నిమిషాల వ్యవధిలో పుంజుకున్న బీజేపీ.. ఎన్డీయేదే గెలుపు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిమిషాల వ్యవధిలో తారుమారయ్యాయి. మంగళవారం ఉదయం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే, బీజేపీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఆధిక్యాన్ని తుడిసిపెట్టేసింది. ఫలితంగా ఆధిక్యపు బలాబలాలు తారుమారయ్యాయి. 
 
ఉదయం 10 గంటల వరకూ స్పష్టమైన ఆధిక్యంలో ఉండి, సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన మహా ఘటబంధన్, ఆపై అనూహ్యంగా వెనక్కు పడిపోయింది. ఎన్డీయే మెజారిటీ నంబర్ 125తో పోలిస్తే 8 అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యంలో ఉండగా, మహా ఘటబంధన్ 109 చోట్ల ఆధిక్యంలో ఉంది. కింగ్ మేకర్‌గా మారతారని భావించిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 4 స్థానాలకు, ఇతరులు 8 స్థానాలకు పరిమితం అయ్యారు.
 
ఇక, బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తర్వాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల్లో బీహార్ ఫలితాలపై పూర్తి స్పష్టత వెలువడుతుంది.