1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (10:50 IST)

ఉన్నవో ఘటన.. పోలీస్ దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి

ఉన్నవో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కరోనా నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూను విధించింది. ఈ క్రమంలోఉన్నవో జిల్లాలోని 17 ఏళ్ల బాలుడు కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించాడంటూ.. అక్కడి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డు కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టారు. 
 
పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమించడంతో వెంటనే బాలుడిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పోలీసు చర్యతో ఆగ్రహించిన కుటుంబీకులు, స్థానికులు లక్నో రోడ్‌ క్రాసింగ్‌ వద్ద రహదారిని దిగ్బంధం చేశారు. 
 
దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డును వెంటనే సస్పెండ్‌ చేశారని, ఘటనపై విచారణ చేపట్టారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.