1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (17:16 IST)

హథ్రాస్ తొక్కిసలాట కేసు : ఆరుగురిని అరెస్టు చేసిన యూపీ పోలీసులు

Hathras police
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం అలీఘర్ ఐజీ శలబ్ మాథూర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 121 మంది చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, 112 మంది మహిళలు, ఆరుగురు బాలురు, ఒక బాలిక ఉన్నట్టు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి 72 గంటల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిర్వాహుకలను కూడా అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో 121 మంది మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందన్నారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్టు చెప్పారు. మొయిన్‌పురిలోని ఆశ్రమంలో భోలా బాబా కోసం గాలించామని, కానీ ఆయన పరారీలో ఉన్నారని, ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
 
బాబా పాదాల కింద మట్టి కోసం ఎగబడటం వల్లే.. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్‌లోజరిగిన తొక్కిసలాటపై భోలే బాబా స్పందించారు. ఈ తొక్కిసలాటలో 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటపై భోలే బాబా స్పందించారు. 
 
ఈ ఘటనలో 121 మంది భక్తులు చనిపోయారు. ఘటన జరిగిన ఒకరోజు తర్వాత భోలే బాబా ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను వేదికపై నుంచి వెళ్లిపోయాకే తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
భక్తులను భోలో బాబా సిబ్బంది తోసేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 'ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నాడు. ఈ సత్సంగ్‌కు దాదాపు రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. బాబా మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వేదిక వద్దకు వచ్చాడు. గంటపాటు కార్యక్రమం కొనసాగిన తర్వాత, 1.40 గంటలకు భోలే బాబా బయటకు వచ్చాడు. వేదిక నుంచి వెళ్లే క్రమంలో దర్శనం కోసం భక్తులు ఆయన వెంట పరుగెత్తారు. ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది' అని దర్యాప్తులో తేలింది.