మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:51 IST)

అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు.. వాష్‌రూమ్ వెళ్ళొస్తానని వధువు పరార్.. పండితుడు కూడా..?!

మనసుకు నచ్చిన వధువుతో కోటి ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న ఆ వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చింది ఆ వధువు. కాసేపు పెళ్లి అవుతుందనుకుంటుండగా పెళ్లి పీటల మీద నుంచి తప్పించుకుని వరుడికి షాకిచ్చింది. చిటికెన వేలు పట్టుకుని ఏడు సార్లు అగ్నిహోత్రం చుట్టూ ప్రదిక్షణలు చేయకుండానే.. టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. 
 
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా.. పెళ్లి తంతు నిర్వహించే పండిట్ వరకూ అంతా మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పరిధిలో గల మోదీనగర్‌లో నివసిస్తున్న యువకుడికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అయితే యువతిని పెళ్లి చేసుకోవాలంటే లక్ష రూపాయల ఎదురు కట్నం ఇవ్వాలని షరతు పెట్టారు. 
 
దానికి అంగీకరించిన యువకుడి కుటుంబ సభ్యులు.. పెళ్లి వేడుకలో లక్ష రూపాయలు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు.. పార్తపూర్‌లో భదబ్రాల్ గ్రామంలోని ఆలయంలో యువతి, యువకుడికి వివాహ ఏర్పాట్లు చేశారు. వారి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నడుస్తోంది.
 
అయితే ఒప్పందంలో భాగంగా వరుడి కుటుంబం నుంచి యువతి కుటుంబానికి పెళ్లి వేదికపైనే లక్ష రూపాయలు ముట్టాయి. ఆ సమయంలో వధువు, వరుడు కలిసి పెళ్లి వేదికపై ఉన్న అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటికి నాలుగు ప్రదక్షిణలు చేశారు. ఇంతలో వరుడి కుటుంబం నుంచి డబ్బు అందడంతో.. వధువు తన నాటకాలు మొదలు పెట్టింది. 
 
వాష్‌రూమ్‌కి వెళ్లివస్తానంటూ వేదిక నుంచి వెళ్లిన యువతి అటు నుంచి అటే ఉడాయించింది. ఒంటిపై ఉన్న నగలతో సహా, వారు ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుని పారిపోయింది. యువతి పారిపోయిందనే విషయం తెలియగానే వివాహ వేదిక వద్ద ఉన్న పురోహితుడు, యువతి తల్లిదండ్రులు సైతం అక్కడి నుంచి పారిపోయారు.
 
దీంతో..వరుడి కుటుంబ సభ్యులు సహా వివాహానికి హాజరైన బంధువు కంగుతిన్నారు. తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించిన బాదితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకుపోయిన యువతి సహా.. ఆమె తల్లిదండ్రులు, పురోహితుడి కోసం గాలిస్తున్నారు.