1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఊపిరి ఆగిపోయిన రెండేళ్ళ చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు...

Baby
విమాన ప్రయాణ సమయంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారికి వైద్యులు ప్రాణంపోశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నుంచి ఢిల్లీకి విస్తారా సంస్థకు చెందిన విమానం యూకే 814 ఆదివారం బయలుదేరింది. ఈ విమానంలో గుండె సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగుళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు గాల్లోకి ఎగిరిన తర్వాత 30 నిమిషాలకే చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. 
 
ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారిపోయాయి. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పూర్ వైపు మళ్లించారు. ఓ సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన నలుగురు వైద్యుల బృందం చిన్నారి పరిస్థితిని గమనించారు. వారికి ఐఎల్బీఎస్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు జతకలిశారు. 
 
వీరంతా కలిసి చిన్నారి ఊపిరి తీసుకొనేందుకు వీలుగా శ్వాసనాళాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీపీఆర్ చేయడంతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రథమ చికిత్స ద్వారా పాపను రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. విమానంలో జరిగిన ఈ ఘటనతోపాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ ట్విటర్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.