శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (12:20 IST)

అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్

నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు మరుజన్మలో ఆడ కుక్కలుగా పుడుతారంటూ స్వామి కృష్ణస్వరూప్ దాస్‌జీ అంటున్నారు. ఇలాంటి మహిళలు చేసిన వంటను ఆరగించే పురుషులు ఎద్దులుగా పుడుతారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
గుజరాత్‌ రాష్ట్రంలోని భుజ్‌లో స్వామినారాయణ్ మందిరం ఉంది. దీన్ని స్వామి కృష్ణస్వరూప్ దాస్‌జీ పర్యవేక్షిస్తున్నారు. ఈ మందిరం ఆధ్వర్యంలో సహజానంద గాళ్స్ ఇనిస్టిట్యూట్ నడుస్తోంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసే అమ్మాయిలు నెలసరి సమయంలో వంటగదిలోకి వచ్చి ఇతరులతో కలిసి భోజనం చేయకూడదన్న నిబంధన ఉంది. 
 
కానీ, ఇటీవల ఇద్దరు అమ్మాయిలు ఈ నిబంధనను ఉల్లంఘించారు. ఈ విషయం ప్రిన్సిపాల్‌కు తెలియడంతో ఆగ్రహించి, 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పించి మరీ పరిశీలించిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనమైంది. ఈ కేసులో ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
ఇదిలావుంటే, తాజాగా గుజరాత్‌లో కృష్ణస్వరూప్ దాస్‌జీ వీడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ.. తన అభిప్రాయాలు నచ్చినా, నచ్చకపోయినా తాను పట్టించుకోబోనన్న ఆయన పురుషులు వంట నేర్చుకోవాలని సూచించారు. 
 
ఎందుకంటే.. నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా, ఆ వంట తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారని సెలవిచ్చారు. ఇది తాను చెబుతున్న విషయం కాదని, శాస్త్రాల్లో ఉన్నదే తాను చెప్పానని పేర్కొన్నారు. 
 
ఈ విషయాలన్నీ చెప్పడం తనకు ఇష్టం లేదంటూనే, మిమ్మల్ని హెచ్చరించాలనే ఉద్దేశంతో చెప్పినట్టు వివరించారు. అయితే, ఈ వీడియో కచ్చితంగా ఎప్పటిదన్న విషయాలు తెలియకపోయినా, ఇలాంటి వీడియోలు ఆలయ యూట్యూబ్ చానల్‌లో చాలానే ఉన్నాయి.