1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 4 అక్టోబరు 2021 (12:21 IST)

దేశంలో 200 రోజుల కనిష్ఠానికి క‌రోనా క్రియాశీల కేసులు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే, తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే చోటుచేసుకోవడం ఊరట కలిగిస్తోంది.
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయి. నిన్న 180 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,997కి చేరింది. ఇక కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కవగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న ఒక్క రోజే 26,718 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 3.31 కోట్లకు చేరింది.
 
రీకవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరి 2,64,458(0.78%)గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 90.79 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.