శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (12:38 IST)

దేశంలో లక్ష దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 86,498 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 63 రోజుల తరవాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.
 
సోమవారం 18,73,485 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..86,498 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు 2.89కోట్లకు పైబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి నిత్యం లక్షకు పైగా నమోదైన కేసులు..ఒక దశలో నాలుగున్నర లక్షలకూ చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ వంటి కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాయి.

ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న కేసులు నిన్న లక్ష దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు కూడా 4.62 శాతానికి చేరింది. ఇక కొద్ది రోజులుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతూనే ఉంది. తాజాగా 2,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,51,309 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.

కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కూడా ఊరటనిస్తోంది. గత 26 రోజులుగా రోజూవారీ కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,82,282 మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 2,73,41,462(94.29శాతం)కి చేరింది. క్రియాశీల కేసులు 13లక్షలకు చేరాయి.

క్రియాశీల రేటు 4.50 శాతానికి తగ్గింది. మరోవైపు, నిన్న 33,64,476 మందికి టీకాలు ఇచ్చారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 23,61,98,726కి చేరింది.