1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (13:17 IST)

బిపిన్ రావత్ మృతిపై నివేదిక: రక్షణ మంత్రికి ప్రజెంటేషన్

భారత వైమానిక దళం నేతృత్వంలోని ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న ట్రై-సర్వీసెస్ దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రికి ప్రజెంటేషన్ చేసి తన నివేదికను సమర్పించనుంది. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు మ‌రో 12 మంది ఇతర సైనికులు అమరులయ్యారు. ఘ‌ట‌న తర్వాత వైమానిక దళం దర్యాప్తుకు ఆదేశించింది. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందంలో ఆర్మీ, నేవీకి చెందిన ఇద్దరు బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు ఉన్నారు.
 
ఇక‌ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన తర్వాత.. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. బ్లాక్‌బాక్స్‌ని, ఫ్లైట్ డేటా రికార్డర్ అని కూడా అంటారు. బ్లాక్ బాక్స్ లభించిన నేప‌థ్యంలో ఈ కేసులో కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  
 
భారత వైమానిక దళ ఉన్నతాధికారులతో పాటు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్న‌తాధికారులు కూడా పాల్గొంటారని రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. సీనియర్ అధికారులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని కూడా సవరించాలని ట్రై-సర్వీస్ బృందం సిఫారసు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.