1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:01 IST)

సంచలన మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ ఉన్నతాధికారి అరెస్టు

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల జాబితాలో ఒక ఈడీ అధికారి పేరు కూడా చేరడం ఇపుడు ఆసక్తిగా మారింది. 
 
ఈడీ ఫిర్యాదు నేపథ్యంలో క్లారిడ్జస్ హోటల్స్ గ్రూప్ ఎండీ విక్రమాదిత్య, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్‌పైనా కేసు నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా తదితరులపై మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ, ఈడీలో క్లర్కుగా పనిచేస్తున్న నితీశ్ కోహార్ రూ.5 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అమన్ దీప్ సింగ్ థాల్‌కు 'సాయం' చేసేందుకుగాను ఈ ముడుపులు అందినట్టు తెలుస్తోంది. దీపక్ సాంగ్వాన్, ప్రవీణ్ వత్స్ అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈడీ అధికారి పవన్ ఖత్రీ ద్వారా సాయం చేస్తామంటూ వీరు అమన్ దీప్ సింగ్ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారు.
 
అయితే, అమన్ దీప్ సింగ్ను మార్చిలో అరెస్ట్ చేయడంతో తమ డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ అమన్ దీప్ తండ్రి డిమాండ్ చేశారు. దాంతో ఈడీ అధికారి ఖత్రీ సమక్షంలో కోటి రూపాయలను వత్స్ తిరిగిచ్చేశాడు. మిగతా మొత్తంలో ఈడీ అధికారుల ఖర్చులు మినహాయించి సమానంగా పంచుకోవాలని ప్రణాళిక వేశారు. ఈ వ్యవహారంలో ఖత్రీ పాత్ర కూడా ఉండటంతో సీబీఐ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.