శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (08:27 IST)

ఏడాదిగా బందీగా పడి ఉన్నా: కేంద్ర మాజీ మంత్రి సైఫుద్దీన్‌ సోజ్‌

ఏడాదిగా గృహనిర్బంధంలో బందీగా పడి ఉన్నానని కేంద్ర మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌నాయకుడు సైఫుద్దీన్‌ సోజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన శ్రీనర్‌ ఫ్రెండ్స్‌ కాలనీలోని తన నివాసంలో గేటు దగ్గర ఉన్న ఒక పొడవైన పిల్లర్‌ (స్తంభం) ఎక్కి బయట ఉన్న విలేకరులతో మాట్లాడుతూ.."పోలీసుల అనుమతి లేకుండా కాలు బయటపెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చర్యలు తన ప్రజాతంత్ర జీవనానికి విఘాతం కలిగిస్తున్నాయి.

ఈ ప్రభుత్వం పోవాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజాతంత్ర సంస్థలకు ఈ ప్రభుత్వం చేసిన నష్టం పై ప్రజలు మదింపు వేసుకునేందుకు వీలవుతుంది. భారత రాజ్యాంగంపైన, జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగంపైన రెండిటిపైనా నమ్మకముంది. ఈ దేశంలో భావ వ్యక్తీకరణకు చోటులేని ప్రాంతం ఏదైనా ఉన్నదీ అంటే అది కాశ్మీరే.

ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాని మోడీని పొగడడం చాలా బాధ అనిపించింది. న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. నిబంధల ప్రకారం నడచుకోవాలి. కానీ, మోడీ ప్రభుత్వం ఈ సంస్థలను కూడా నిర్వీర్యం చేసింది" అని మండిపడ్డారు.

ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా తనను గత ఏడాది ఆగస్టు 5 నుంచి గృహనిర్బంధంలోనే ఉంచారని ఆయన గద్గద స్వరంతో అన్నారు. అప్పుడు కూడా పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మీడియాతో మాట్లాడితే చర్యతీసుకోవాల్సి వస్తుందని సోజ్‌ను బెదిరించారు. సైఫుద్దీన్‌ సోజ్‌ నివాసం వెలుపల వున్న వాతావరణం చూస్తే నిజంగానే అదొక జైలులా అనిపిస్తోంది. 

జమ్మూ కాశ్మీర్‌ పాలనాయంత్రాంగం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సైఫుద్దీన్‌ సోజ్‌ స్పేచ్ఛా జీవి. ఆయన ఎలాంటి నిర్బంధంలోనూ లేరు అని తెలియజేసింది. కాశ్మీర్‌ పాలనా యంత్రాంగం ఇచ్చిన ప్రకటను సుప్రీంకోర్టు ఆమోదించిది.