1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (15:17 IST)

భారతీయులు ఏమైనా సాధించగలరు.. మోదీనే నిదర్శనం: డొనాల్డ్ ట్రంప్

Donald trump_Modi
నమస్తే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ తన స్నేహితుడని చెప్పేందుకు గర్విస్తున్నానని తెలిపారు. ‘నమస్తే ట్రంప్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానిస్తూ.. 1.20 లక్షల మందిని ఒకేచోట చూడడం ఆనందంగా ఉందన్నారు. ''మా హృదయంలో ఎప్పుడూ భారత్‌కు ప్రత్యేక స్థానం వుందని, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మోదీకి కృతజ్ఞతలన్నారు. 60 కోట్లమంది ఓటర్లు మోడీకి తమ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని.. ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
చాయ్‌వాలా నుంచి నరేంద్ర మోదీ ఎదిగారు. గత ఏడాది మోడీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. మోడీ, గుజరాతే కాదు.. దేశం గర్వించదగ్గ నేత.. అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. భారతీయులు ఏమైనా సాధించగలరు అనడానికి మోడీయే నిదర్శనం.. అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ఇంకా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉగ్రవాద కార్య కలాపాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ''చచ్చిపోయింది'' అని వ్యాఖ్యానించారు. టెర్రరిజం అన్నది గ్లోబల్ సమస్య అని, ఈ బెడదను తుదముట్టించేందుకు భారత, అమెరికా దేశాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని హామీ ఇచ్చారు. 
 
బాగ్దాద్, సిరియా వంటి దేశాల్లో ఈ ''తీవ్రవాదం'' ఇంకా పెఛ్చరిల్లుతోందని, దీన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము పలు చర్యలు చేపట్టామని ట్రంప్ అన్నారు. సోమవారం ప్రధాని మోడీతో కలిసి అహ్మదాబాద్‌లోని అతి పెద్ద మోతేరా స్టేడియంలో.. భారీ సంఖ్యలో హాజరైన ప్రజాసభలో మాట్లాడిన ట్రంప్.. రక్షణ రంగంలో భారత, అమెరికా దేశాలు సహకరించుకుంటున్నాయని చెప్పారు.