గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (14:53 IST)

పట్టువీడని రైతులు.. మెట్టు దిగని సర్కారు : అమిత్ షా ఆఫర్ తిరస్కృతి

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రైతులంతా కలిసి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధం కాగా, కరోనా ఆంక్షల పేరుతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత నాలుగు రోజులుగా సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. రైతుల ఆందోళ‌న‌తో ఢిల్లీకి వ‌చ్చే చాలా దారులు మూసుకుపోవ‌డంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతుల‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. 
 
మీరు మీ ఆందోళ‌న‌ల‌ను బురారీ ప్రాంతానికి మార్చండి.. ప్ర‌భుత్వం వెంట‌నే మీతో చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్‌ను పంజాబ్‌కు చెందిన 30 రైతు సంఘాలు తిరస్క‌రించాయి. అమిత్ షా ఆఫర్‌పై ఆదివారం ఉద‌యం నుంచి స‌మాలోచ‌న‌ల‌ను జ‌రిపిన రైతు సంఘాల నేత‌లు.. చివ‌రికి ఆ ఆఫ‌ర్‌కు నో చెప్పారు. 
 
డిసెంబ‌ర్ 3న ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల కోసం ఇప్ప‌టికే కొన్ని సంఘాల నేత‌ల‌ను ఆహ్వానించిన‌ట్లు కూడా అమిత్ షా తెలిపారు. అయితే వెంట‌నే చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని వాళ్లు డిమాండ్ చేయ‌డంతో మీరు ఆందోళ‌న‌ను మేము చెప్పిన చోట నిర్వ‌హించాల‌ని షా అన్నారు. 
 
ఇదిలావుంటే, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న పలువురు రైతులపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్యాయత్నం తదితర కేసులను బనాయించింది. నిరసనల సందర్భంగా రైతులపై ప్రయోగించిన జలఫిరంగులను ఆపేందుకు ప్రయత్నించిన 26 యేళ్ల నవదీప్‌ సింగ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు మోపారు. 
 
అయితే రైతులను కాపాడేందుకు యత్నించిన నవదీప్‌ సింగ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌, మరికొందరు రైతులపైనా హత్యాయత్నం, దోపిడీ, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. అయినప్పటికీ రైతులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.