1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (12:36 IST)

కేంద్ర అప్పులు రూ.155 లక్షల కోట్లు - విదేశీ రుణాలు 4.5 శాతం

Nirmala Sitharaman
కేంద్ర ప్రభుత్వ అప్పులను విత్తమంత్రి నిర్మలా సీతామన్ తాజాగా వెల్లడించారు. 2023 మార్చి నాటికి మొత్తం రుణాలు రూ.155.8 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇది డీజీపీలో 57.3 శాతంతో సమానమని వివరించారు. ఇందులో విదేశీ అప్పు తాజా మారకద్రవ్య విలువ ప్రకారం రూ.7.03 లక్షల కోట్లని ఇది జీడీపీలో 2.6 శాతంగా ఉందని తెలిపారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, భారత రాష్ట్ర సమితి సభ్యుడు నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం రుణాల్లో విదేశీ అప్పు 4.5 శాతమేనని తెలిపారు. విదేశీ రుణాలను సాధారణంగా బహుముఖ, ద్వైపాక్షిక సంస్థలు రాయితీ రేటుతో ఇస్తుంటాయని చెప్పారు. అందువల్ల ఇందులో ముప్పు ఏమీ ఉండదని పేర్కొన్నారు.
 
మరోవైపు ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, దేశ వ్యాప్తంగా ఉండే ఏటీఎం యంత్రాల్లో రూ.2 వేల నోట్లను నింపొద్దని బ్యాంకులకు ఆర్థిక శాఖ చెప్పలేదని తెలిపారు. ఏటీఎంలలో ఏ నోట్లు ఎంత సంఖ్యలో పెట్టాలన్న విషయమై బ్యాంకులు సొంత అంచనా వేసుకొని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అక్కడ వినియోగదారుల అవసరాలు, సీజనల్‌ ట్రెండ్‌ను బట్టి అవి దీనిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. అయితే, గత 2019-20 తర్వాత రూ.2 వేల నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ ఎలాంటి ఇండెంట్‌ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేశారు.