1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:41 IST)

ఎలక్ట్రిక్ బైక్ విసిగెత్తించింది. స్కూటర్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టిన డాక్టర్

e-scooters
ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతి కావడం.. ఆటోమేటిక్‌గా వెనక్కి వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి అసహనం తారాస్థాయికి చేరుకుంది. దాంతో అతడు లక్షలు పోసి కొనుగోలు చేసిన తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తగులబెట్టాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ పృథ్వీరాజ్ మూడు నెలల క్రితం ఓలా ఎస్-1 ప్రో కొనుగోలు చేశాడు. అయితే కంపెనీ చెప్పినట్టుగా ఈ స్కూటర్ మైలేజ్ అందించడం లేదట. అలాగే దీని పనితీరు చాలా పేలవంగా ఉండటంతో పాటు తరచూ రిపేర్‌కి వస్తోందట. 
 
ఈ సమస్యను ఓలా కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా అటువైపునుంచి కనీస స్పందన కూడా కరువయిందట. దీనితో ఈ రిపేర్ ఖర్చులను భరించలేక ఓనర్ తన స్కూటర్‌ను తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సింగిల్ ఛార్జ్‌పై 181 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ చెప్పినట్లుగా మైలేజ్ రావడం లేదని అతను వాపోయాడు. ఒకరోజు కేవలం 44 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని స్కూటర్ ఆగిపోయిందట. 
 
180 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయొచ్చు అనుకున్న ఆ వ్యక్తికి దీంతో దిమ్మ తిరిగినంత పని అయిందట. ఈ కోపంతోనే అతను స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.