గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 30 మే 2019 (16:36 IST)

గంగానది నీటిని నేరుగా తాగితే ఏమవుతుందో తెలుసా?

హిందువులకు గంగా నది ఎంతో పవిత్రమైనది. "నీరు" అనే పదానికి సంస్కృతంలో "గంగ" అనే పేరు ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి దగ్గర భాగీరధి నది ఉద్భవించింది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని "గంగ" అని పిలుస్తారు. గంగా జలాన్ని హిందువులు పుణ్య తీర్థంగా భావిస్తారు. 
 
అయితే కొంత కాలంగా గంగానది కాలుష్యంతో నిండిపోయి ఉంది. ప్రక్షాలన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో గంగానదిలో ప్రవహిస్తున్న నీటిలో అత్యంత ప్రమాదకరమైన కొలీఫామ్‌ బ్యాక్టీరియా 50,000 స్థాయి మించి ఉన్నందున నేరుగా ఈ జలాన్ని తాగడం సురక్షితం కాదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఇటీవల సీపీసీబీ విడుదల చేసిన తాజా నివేదికలో అత్యంత ప్రమాదకరమైన కొలీఫామ్‌ బ్యాక్టీరియా 50,000 స్థాయిని మించి ఉందని, కేవలం ఏడు చోట్ల నుంచి సేకరించే నీటిని, అది కూడా శుద్ధి చేసుకొని మాత్రమే తాగాలని సూచించింది.
 
ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ నుండి ప్రవహిస్తూ వస్తున్న పాయలలోని నీరు తాగడానికి గానీ లేదా స్నానాలకు గానీ పనికిరాదని పేర్కొంది. అంతేకాకుండా కోలిఫామ్‌ బ్యాక్టిరీయా ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్‌ను కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. 86 చోట్ల ప్రత్యక్ష పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసి నీటిని పరిశీలించిన మీదట 78చోట్ల నీరు అత్యంత కలుషితంగా ఉన్నట్లు, 18 చోట్ల మాత్రమే నీరు స్నానాలకు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది.
 
తాగటానికి, స్నానం చేయడానికి గోమతి, వారణాసిలోని గోలా ఘాట్‌, రాయ్‌ బరేలీలోని దల్‌మవు, అలహాబాద్‌లోని సంగం, ఘజియాపూర్‌, బక్సర్‌, పట్నా, భగల్పూర్‌, హౌరా-శివ్‌పూర్‌లు వంటి చోట్ల ఉన్న నీరు పనికి రాదని తెలిపింది. ఇక గంగోత్రిలోని భాగిరథి,  రుద్రప్రయాగ, దివ్యప్రయాగ, రైవల, రిషేకేశ్‌, బిజ్నోర్‌, డైమండ్‌ హార్బర్‌లలో మాత్రం నీరు శుద్ధి చేసుకొని తాగాలని సూచించింది.