గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఎర్రకోటలో హింస : గ్రెటా టూల్ కిట్ కేసులో బెంగళూరు యువతి అరెస్ట్

భారత గణతంత్ర వేడుకల రోజున దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసకుదారితీసింది. దీనిపై కేంద్రం కన్నెర్రజేసింది. ఫలితంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా ఢిల్లీ పోలీసులు మరో ముందడుగు వేశారు. 
 
దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను అరెస్టు చేశారు. 
 
బెంగళూరులోని సోలదేవనహల్లికి చెందిన దిశ రవి అనే పర్యావరణ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆమెను.. తన ఇంట్లో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
 
అంతేకాకుండా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ వ్యవహారంలో గ్రెటా పోస్ట్ చేసిన టూల్ కిట్‌ను ఎడిట్ చేసి తదుపరి పోస్ట్ చేశానని ఆమె అంగీకరించినట్టు స్పెషల్ సెల్ పోలీసులు చెబుతున్నారు. 
 
కాగా, మౌంట్ కార్మెల్ విమెన్ కాలేజీలో ఆమె చదువుతోంది. గ్రెటా థన్ బర్గ్ పర్యావరణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన 2018 ఆగస్టు నుంచి.. ఆమె కూడా ఇక్కడ ఉద్యమాలు చేస్తోంది. అందులో భాగంగానే ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది.
 
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ దేశంలో పెను ప్రకంపనలు రేపింది.
 
సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో చేస్తున్న రైతుల ఉద్యమానికి ఇటీవల గ్రెటా థన్బర్గ్ కూడా మద్దతు తెలిపింది. ఓ టూల్ కిట్‌ను షేర్ చేసింది. ఖలిస్థానీ గ్రూప్ అయిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ తయారు చేసిందని, ఆ టూల్ కిట్ వల్లే జనవరి 26న హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. గ్రెటాపైనా కేసు నమోదు చేశారు.