1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (11:39 IST)

జమిలి ఎన్నికల నిర్వహణ కష్టం : కేంద్ర మంత్రి అర్జున్ రామ్

arjun ram
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, అయితే ఇందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నట్లు తెలిపారు. రాజ్యాంగ సవరణ అవసరమని, కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశానికి సంబంధించి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. 
 
ఎన్నికలకు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకేసారి అన్నిచోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాకపోవచ్చునని ఆయన అన్నారు. 
 
జమిలి నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని, తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.