గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (13:23 IST)

భారతావనికి ప్రతీకనంటూ మతపెద్దలకు కౌంటరిచ్చిన నుస్రత్ జహాన్...

తాను భారతావనికి ప్రతీకను అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తనపై ఫత్వా జారీ చేసిన మతపెద్దలకు ఆమె ధీటుగా కౌంటరిచ్చింది. జన్మతః ముస్లిం అయిన నుస్రత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. అంతేనా, హిందూ పారిశ్రామికవేత్తను పెళ్లాడింది. 
 
దీంతో ఆమె ఈ నెల 25వ తేదీన లోక్‌సభలో అడుగుపెట్టింది. అపుడు మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్లెలు, నుదుట కుంకుమ బొట్టుతో లోక్‌సభలో అడుగుపెట్టింది. దీంతో ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీచేశారు. 
 
తనపై వచ్చిన విమర్శలకు నుస్రత్ శనివారం సమాధానమిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. "కుల, మత, ప్రాంతాలకు అతీతమైన భారతావనికి ప్రతీకను నేను. జన్మతః ముస్లింనైనా, నేను అన్ని మతాలను గౌవరవిస్తాను. ఇప్పటికీ నేను ముస్లింనే. నేనే ఏం ధరించాలో చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసమనేది అలంకరణకు సంబంధం లేనిది. అది అన్ని మతాలలో ఉన్న అర్థం పర్థంలేని సిద్ధాంతాలకు మించినది" అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
కొందరు మత చాందసవాదులు చేసే విమర్శలకు స్పందించడం అంటే జాతి విద్వేషాలను రెచ్చగొట్టడం, హింసను ప్రోత్సహించడమేనని.. చరిత్రే దీనికి సాక్ష్యమని ఘాటుగా వ్యాఖ్యానించారు. నుస్రత్ జహాన్‌కు బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.
 
కాగా, ఈమె ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బసీర్హత్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి 3.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మహిళా ఎంపీగా నిలిచారు. తృణమూల్ నుంచి పోటీ చేసిన 17 మంది మహిళా ఎంపీలలో ఆమె ఒకరు.