1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:07 IST)

ధోవతి - కుర్తాలు కాదనీ సూటూబూటు ధరిస్తున్నారు... ఆర్థిక మాంద్యమెక్కడ : బీజేపీ

దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. సూటూబుటు వేసుకుంటున్నాం... మరి ఆర్థిక మాంద్యమెక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో వీరేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, ఢిల్లీలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక తిరోగమనం గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయంటూ.. నిజంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారివుంటే.. తామంతా కుర్తాలు.. ధోవతీలు ధరించి ఈ సమావేశానికి వచ్చి ఉండేవారమన్నారు. 
 
దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని ఎలా చెప్పగలరు అంటూ ప్రశ్నిస్తూ.. దేశంలో చాలామంది జాకెట్, సూట్లు ధరిస్తున్నారన్నారు. వాటితో పోలిస్తే.. తక్కువ ధరకు లభించే సంప్రదాయ ధోవతీలు, కుర్తాలు ఎందుకు ధరించడంలేదో చెప్పాలన్నారు. 
 
ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉందనడానికి చిహ్నమని తాను పక్కగా చెబుతున్నానన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే.. మంచి సూట్లు, ప్యాంట్లు, పైజామాలు ధరించేవారం కాదని ఎంపీ చెప్పారు.
 
మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితిని చూసి దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదంటూ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తన తప్పులు ఒప్పుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 
 
'సమస్యలనేవి కాలచక్రంలా వచ్చిపోయేవని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలేదు. ఇవాళ ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. పెట్టుబడులు పెట్టేవారికి కనీసం ప్రోత్సాహాలు లేవు. దీనికితోడు దేశంలో ఎక్కడ చూసినా భయం, అనిశ్చితి ఆవరించాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు' అని చిదంబరం ఆరోపించారు.