1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:04 IST)

మూన్ లైటింగ్ ఉద్యోగులకు చిక్కులు - ఐటీ శాఖ నోటీసులు

computers
కరోనా సమయంలో మూన్‌లైటింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పదం ఎక్కువగా వినిపించింది. ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. మరి కొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. ఇపుడు మరోమారు ఈ అంశం చర్చకు వచ్చింది. 
 
మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన ఉద్యోగుల్లో కొందరు.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించకపోవడమే ఇందుక్కారణం. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక 'ఎకనమిక్‌ టైమ్స్‌' పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రమే రిటర్నుల్లో చూపించినట్లు ఐటీశాఖ గుర్తించింది. దీంతో ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ సంఖ్య దాదాపు వెయ్యికిపైనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొన్ని కంపెనీలే స్వయంగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మున్ముందు మరింత మందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.