ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (13:24 IST)

ఓటరు గుర్తింపు కార్డుకు - ఆధార్ కార్డు - అనుసంధాన గడువు పెంపు

voter id aadhaar
దేశంలో నకిలీ ఓటర్ల ఏరివేత చర్యల్లో భాగంగా, ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబరుకు అనుసంధానం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ రెండు కార్డుల అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్రం మరోమారు పొడగించింది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
గతేడాది జూన్‌ 17వ తేదీన న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం గడువు ఏప్రిల్‌ 1వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఓటర్లు ఫామ్‌ 6-బీను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్‌ రిజిస్టర్డ్‌ ఓటర్ల నుంచి ఆధార్‌ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. డిసెంబర్‌ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్‌ సంఖ్యలను సేకరించినట్లు సమాచారం. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు కింద వెల్లడించారు.
 
మరోవైపు పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసింది. దీంతోపాటు రూ.1000 అపరాధ రుసుంను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్‌ - పాన్‌ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగియనుంది. 
 
ఒకవేళ ఇలా అనుసంధానం చేసుకోలేకపోతే పాన్‌ కార్డు పనిచేయదు. అయితే, ఇలా మార్చి 31, 2022 నాటికి ఉచితంగానే అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 1, 2022 వరకు పొడిగించిన ప్రభుత్వం జులై 1, 2022 నుంచి దాన్ని రూ.1000కి పెంచింది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.