శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (10:59 IST)

భారత్ నయా డీల్.. బ్రహ్మోస్ విక్రయాలకు సిద్ధం... తొలి కస్టమర్ ఆ దేశమే...

భారత్ మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ అవసరాల నిమిత్తం అత్యాధునిక ఆయుధాలను పలు దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇపుడు భారత్ ఇదే రక్షణ ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించనుంది. అలాంటి ఆయుధాల్లో ఒకటి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్. భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకభూమికను ఈ బ్రహ్మోస్ అస్త్రాలు పోషిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ దేశం ఆసక్తి చూపింది. దీంతో ఆ దేశానికి బ్రహ్మోస్‌ క్షిపణులను విక్రయించాలని భారత్ నిర్ణయించింది. 
 
ఇదే అంశంపై వచ్చే యేడాది ప్రధాని నరేంద్ర మోడీ, ఫిలిప్పీన్స్ దేశాధినేత రొడ్రిగో డ్యూరెట్టిల మధ్య కీలక భేటీ జరుగనుంది. ఈ భేటీ తర్వాత బ్రహ్మోస్ అస్త్రాల విక్రయంపై సంతకాల ఒప్పందం జరుగనుంది. 
 
కాగా, ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్‌ను న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ - రష్యా జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ తయారు చేస్తోంది. ఈ టీమ్ డిసెంబరులో మనీలాలో పర్యటించి, ఇరు దేశాల మధ్యా కుదలార్సిన డీల్‌పై తుది రిపోర్టును సమర్పించనుంది. 
 
ఫిలిప్పీన్స్ ఆర్మీకి భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలన్నది భారత అభిమతమని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.
 
ఈ డీల్‌కు తుది రూపును తీసుకుని వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న అంశాలను పరిష్కరించాల్సివుందని వ్యాఖ్యానించిన ఉన్నతాధికారులు, ఇరు దేశాధినేతల సమావేశానికి ముందుగానే ఇవి ఓ కొలిక్కి వస్తాయని తెలిపారు. కాగా, ఈ సమావేశం తేదీలు ఇంకా ఖరారు కావాల్సి వుంది.
 
ఇక ఈ సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంతో పాటు మరిన్ని ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్యా కుదరనున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో డ్రగ్స్ డీల్, విమానయాన రంగం, టూరిజం తదితరాల విషయంలోనూ ఒప్పందాలు కుదరనున్నాయని తెలుస్తోంది.