1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (14:35 IST)

వృద్ధులకు షాకిచ్చిన రైల్వే మంత్రి : రాయితీలను పునరుద్ధరించలేం...

train
రైళ్ళలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేరుకోలేని షాకిచ్చారు. ప్రయాణ చార్జీల్లో వయో వృద్ధులకు ఇచ్చే రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టంచేశారు. రైల్వోలో పింఛన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని, ఈ నేపథ్యంలో కరోనా కారణంగా రద్దు చేసిన వృద్ధుల రాయితీలను తిరిగి మళ్లీ పునరుద్ధరించే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రాయితీలను ఎపుడు పునరుద్ధరిస్తారంటూ మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణా అడిగిన ప్రశ్నకు ఆయన పార్లమెంట్ వేదికగా సమాధానమిచ్చారు. 
 
ప్రయాణికుల సేవల కోసం గత యేడాది ప్రభుత్వం రూ.59 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని తెలిపారు. రైల్వేలో పింఛన్ల కోసం రూ.60 వేల కోట్లు, వేతనాల కోసం రూ.97 వేల కోట్లు, ఇంధనం కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 
 
అదేసమయంలో రైళ్లలో అధునాతన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వందే భారత్ సెమీ స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను 500 నుంచి 550 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నామని, ఈ రైళ్ళలో స్లీపర్ సదుపాయం వస్తే మాత్రం మరింత దూరం నడిపిస్తామని మంత్రి అశ్విన్ వైష్ణవ్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.