1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జనవరి 2024 (10:48 IST)

ముంబై రన్‌వేపై కూర్చొని భోజనం చేసిన ప్రయాణికులు.. సారీ చెప్పిన ఇండిగో - ఎందుకో తెలుసా?

airport
ఇటీవల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం పక్కనే రన్ వేపై ప్రయాణికులు కూర్చొని రాత్రి భోజనం ఆరగించారు. ఈ ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్ వే పై కూర్చొని ప్రయాణికులు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇండిగో విమాన సంస్థ దిగివచ్చింది. బహిరంగ క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.
 
ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, భవిషత్యలో ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. 
 
కాగా జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు. ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి రన్ వేపైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ ఘటనపై ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ లైన్ కోచ్‌లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో సీఐఎస్ఎఫ్ బృందంతో ఎయిర్ పోర్టు ఆపరేటర్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సేఫ్టీ జోన్లోకి తీసుకొచ్చారని తెలిపింది.