1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (13:05 IST)

భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ డూప్‌లు బహిర్గతం చేస్తా : అస్సాం సీఎం

Himanta Biswa Sarma
భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉపయోగిస్తున్న డూప్ వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ, ఈ యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ఆయన ఆరోపించారు. ఆ డూప్ పేరు, అడ్రస్ వంటి వివరాలను త్వరలో బయటపెడతానని సీఎం తెలిపారు.
 
'ఇదంతా ఊరికే చెప్పట్లేదు. ఆ డూప్ ఎవరు, అతడి అడ్రస్ ఏంటి.. ఇవన్నీ బయటపెడతా. కొన్ని రోజులు ఆగండి. రేపు (ఆదివారం) దిబ్రూగర్‌కు వెళతా. సోమవారం గౌహతిలో పర్యటిస్తా. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాహుల్ డూప్ పేరు, అడ్రస్ అన్నీ బహిర్గతం చేస్తా' అని వెల్లడించారు. 
 
మణిపూర్ నుంచీ మహారాష్ట్ర వరకూ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జనవరి 18 నుంచి 25 మధ్య అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి హిమంత అని మండిపడ్డారు. 
 
ఈ యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఇక గౌహతిలో యాత్ర సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. రాహుల్ గాంధీతో పాటూ మరికొందరిపై ఎఫ్ఎస్ఐఆర్ కూడా నమోదు చేశారు.